పరామర్శల పరంపర..!

◆ ఒకరిని మించి మరొకరు
◆ అధికార బీఆర్ఎస్'లో అంతర్గత పోరు
◆ అయోమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు
వెబ్ డెస్క్(లోకల్ అప్డేట్స్), ఏప్రిల్ 05 : మంథని నియోజక వర్గంలో పరామర్శల పరంపర కొనసాగుతోంది. అందులోనూ అధికార బీఆర్ఎస్ పార్టీలోనే ఒకరిని మించి మరొకరు పరామర్శలకు వెళ్తూ పబ్లిక్ పల్స్ కొట్టేసేందుకు యత్నిస్తున్నారు. వారి ఇరువురి పరామర్శల తంతూ చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ దాని అపొజిట్ పార్టీకి మధ్య ఎన్నికలు జరగడమేమో కాని.. బీఆర్ఎస్'లోనే అంతర్గత పోరుకు ఎన్నికల హడావుడి మొదలైనట్లుగా కనిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం జడ్పీ చైర్మన్ క్యాడర్'లో ఒకరు కొనసాగుతుంటే.. జడ్పీటీసీగా పనిచేసి ప్రస్తుతం ప్యాక్స్ చైర్మన్'గా మరొకరు కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య గ్యాప్ నానాటికి పెరిగి పోతుండటంతో ఎవరి బలాన్ని వారు నిరూపించుకోవడం కోసం.. ఎవరికి వారే సన్నద్ధమవుతున్నారు. దీంతో పరామర్శలు,పెళ్లి వేడుకలు, జన్మదిన వేడుకలు, అన్ని రకాల ఫంక్షన్లు.. ఇలా వేడుక ఏదైనా తమదైన శైలిలో హాజరై పబ్లిక్ టాక్ సంపాదించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
- అంతర్గత పోరులో అధికార బీఆర్ఎస్.. అయోమయంలో కార్యకర్తలు
అధికార బీఆర్ఎస్'లో వీరిద్దరి మధ్య గ్యాప్ అంతర్గత పోరుకు దారితీస్తోంది. ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్ లు పెట్టి పార్టీ అధినాయకత్వానికి తలొగ్గి పని చేస్తామని చెప్పుకొస్తున్నారు. 
          ఇద్దరు ప్రధాన క్యాడర్'లో ఉన్న నాయకులే.. కాని ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిన ఇద్దరు హాజరవుతున్నారు.. అయితే ఇద్దరు ఒకే సారి కాకుండ ఒకరు వచ్చి వెళ్లిన తర్వాత మరొకరు వస్తున్నారు. వీరికి తటస్థంగా ఉన్న కార్యకర్తలు ఇద్దరు వచ్చినప్పుడు వారితో పాల్గొంటున్నారు. మిగతా కొంత మంది కార్యకర్తలు మాత్రం ఒకరితో వెళ్తే.. మరి కొందరు మాత్రం మరొకరితో వెళ్తున్నారు. ప్రధానంగా ఆ ఇరువురి నాయకుల్లో ఒకరు మున్నూరుకాపు సామాజిక వర్గం కాగా మరొకరు రెడ్డి సామాజిక వర్గమునకు చెందినవారు. దీంతో వారి వారి సామాజిక వర్గానికి తగ్గట్టుగా కొంత మంది కార్యకర్తలు మసులుకుంటుంటే మరికొందరు మాత్రం ఇష్టం ఉన్న లేకున్నా నచ్చని నాయకులతో కలిసి పనిచేయాల్సి వస్తోందని చెప్పుకొస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post