కరోనాపై యుద్ధానికి కఠిన నిర్ణయాలు తప్పవు : ప్రధానమంత్రి మోడీ

లోకల్ న్యూస్, జాతీయం : కోవిడ్‌-19పై యుద్ధానికి కఠిన నిర్ణయాలు తప్పవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచ దేశాల పరిస్థితులు చూశాకే లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మన్‌ కీ బాత్‌ సందేశం ఇచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా పేదప్రజలకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతున్నానన్నారు. నాకు తెలుసు మీలో కొందరు నాపై కోపంగా ఉన్నారని. కానీ కరోనాపై యుద్ధంలో ఇటువంటి కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. భారత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం అతి ముఖ్యమన్నారు. లక్ష్మణరేఖను ప్రజలు మరికొన్ని రోజులు పాటించాలని కోరారు. ఎటువంటి లక్షణాలు లేనప్పటికి చాలామంది స్వీయ క్వారంటైన్‌ను పాటిస్తున్నారు. అటువంటి వారందరికి ప్రధాని అభినందనలు తెలిపారు. ఇంకా కొందరు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.  హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించిన వ్యక్తులు నియమాలను ఉల్లంఘిస్తూ యధేచ్చగా తిరుగుతున్నారు. వారికి తాను చెప్పేది ఒక్కటేనన్నారు. లాక్‌డౌన్‌ నియమాలు పాటించకపోతే కరోనా వైరస్‌ డేంజర్‌ నుంచి మనల్ని కాపాడుకోవడం చాలా కష్టతరమైతదని పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించాల్సిందిగా ప్రధాని మరోమారు కోరారు. సామాజిక దూరం అంటే మానసికంగా దూరం కాదన్నారు. 

కోవిడ్‌-19పై పోరాట యోధులకు భారత్‌ వందనం చేస్తుంది...

కోవిడ్‌-19పై పోరాటం చేస్తున్న యోధులకు భారత్‌ వందనం చేస్తుందని ప్రధాని అన్నారు. భారత్‌కు ఇది జీవన్మరణ సమస్య. కరోనాపై వైద్యులు, నర్సులు, సిబ్బంది నిరంతరం పోరాడుతున్నారన్నారు. ఏ విధమైన భౌతిక ప్రతిఫలం ఆశించకుండా రోగులకు సేవ చేసే వైద్యుడే అత్యుత్తమ వైద్యుడని ఆచార్య చరకుడు అన్నారు. ఇటువంటి సేవాభావంతో పనిచేస్తున్న ప్రతి నర్సుకు వందనం చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రపంచం 2020ని నర్సుల అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటోందని ప్రధాని అన్నారు. వీరందరూ సాటిలేని అంకితభావంతో పనిచేస్తున్నట్లు మోదీ కొనియాడారు. కరోనాపై పోరాటంలో నర్సులు, డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది ముందువరుసలో ఉన్నారన్నారు.  

Post a Comment

Previous Post Next Post